తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక గుడ్ న్యూస్. ఇంతవరకు సినిమా షూటింగుల అనుమతుల కోసం ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ కార్పోరేషన్, కార్మిక శాఖ వంటి అనేక కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసివస్తోంది. ఈ దసరా పండుగ రోజు నుంచి సినిమా షూటింగ్ లకు అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అన్ని రకాల అనుమతుల కోసం ఆన్-లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకొని ఫీజులు చెల్లించినట్లయితే, నిర్దిష్ట గడువులోగా అన్ని అనుమతులు ఆన్-లైన్ ద్వారానే మంజూరు చేస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇంతవరకు అన్ని రాష్ట్రాలలో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించుకోవడానికే అనుమతించబడుతోంది. ఈ దసరా పండుగ రోజు నుంచి తెలంగాణా రాష్ట్రంలో అన్ని ధియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు. కానీ 5వ షోలో కేవలం చిన్న సినిమాలు మాత్రమే ప్రదర్శించవలసి ఉంటుంది. ఆర్టీసి బస్టాండ్లలో మినీ సినిమా ధియేటను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ నగరంలో చిత్రపురి కాలనీలో 10 ఎకరాల విస్తీర్ణంలో మినీ ధియేటర్లను నిర్మించాలనుకొంటున్నట్లు మంత్రి తెలిపారు.