కూకట్‌పల్లిలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం!

January 25, 2021
img

ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని నెలలుగా పలుచోట్ల హిందూ దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం జరుగుతోంది. కానీ నేటికీ వాటిని ధ్వంసం చేసినవారిని పట్టుకొని కోర్టులో శిక్షలు పడేలా చేయలేకపోయింది ఏపీ ప్రభుత్వం. దీనిపై అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపిని వేలెత్తి చూపిస్తుంటే, టిడిపి అధికార పార్టీని నిందిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేసుకొంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం చూసి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంతవరకు ఏపీలో కొనసాగుతున్న హిందూ దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా పాకింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో సర్దార్ నగర్‌లోని దుర్గామాత ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆలయ సమీపంలోనే ఎవరో ఓ కుక్కను చంపిపడేశారు. సమాచారం అందుకొన్న కూకట్‌పల్లి పోలీసులు క్లూస్ టీంతో అక్కడకు చేరుకొని సాక్ష్యాధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న భాజపాకు కార్యకర్తలు, హిందు వాహిని సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. నిందితులను వెంటనే పట్టుకొని తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం  ఆలయాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నినదించారు.


Related Post