గురువారం తెల్లవారుజామున 5.40 గంటలకు వనస్థలిపురంలోని వైదేహీ నగర్, బీఎన్ రెడ్డి నగర్లో భూప్రకంపనలు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలు భయబ్రాంతులై ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు. తరువాత తేరుకొని ఇళ్ళల్లోకి వెళ్ళాక మళ్ళీ 6.45 గంటలకు, మళ్ళీ 7.08 గంటలకు మరోసారి వైదేహీ నగర్లో పెద్ద శబ్ధంతో భూమి కంపించడంతో ప్రజలు మళ్ళీ ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ పక్క వానలు, వరదలు, ఇప్పుడు ఈ భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
వారం రోజుల క్రితం గచ్చిబౌలీ ప్రాంతంలో ఇలాగే వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. అయితే అవి రిక్టర్ స్కేలుపై 0.5 నుంచి 0.8 గా నమోదయ్యాయి. సాధారణంగా రిక్టర్ స్కేలుపై 3-5 లోపుగా నమోదైతే ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుమించితే ప్రమాదకరంగా మారుతుంటుంది. నగరంలో ఇవాళ్ళ వచ్చిన భూప్రకంపనలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకా తెలియవలసి ఉంది.