హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ భారీ వర్షం మొదలైంది. మరో 3-4 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అంతవరకు ప్రజలెవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది.
ఇవాళ్ళ తెల్లవారుజామున 3 గంటలకే నగరంలో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వాన మొదలైంది. అది క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఉరుములు, మెరుపులతో భారీ వర్షంగా మారింది. నగరంలో మోహిదీపట్నం, గోల్కొండ, లంగర్ హౌస్, నల్లకుంట, అంబర్ పేట, తార్నాక, హబ్సీగూడ, నారాయణగూడ, ఏఎస్ రావ్ నగర్, కోఠీ, సుల్తాన్ బజార్, అబీడ్స్, నాంపల్లి, పంజగుట్ట, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, చపాపేట్, కుషాయిగూడ, నాగారం, చర్లపల్లి, దమ్మాయిగూడ, నాచారం, బోడుప్పల్, చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, ఉప్పుగూడా, బార్కస్, ఛార్మినార్, పురానాపూల్, దూద్బౌలి, సైనిక్పురి, బేగంపేట తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.
నగరంలో మరో3-4 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే జీహెచ్ఎంసీ అధికారులు, సహాయ సిబ్బంది కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.