ఈఎస్ఐలో ఖాతాలుండి లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి గొప్ప శుభవార్త. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పధకం కింద వారు తాము పనిచేసే సంస్థ నుంచి చివరిసారిగా తీసుకొన్న జీతంలో సగం నిరుద్యోగభృతిగా ఇవ్వబోతున్నట్లు కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ పధకం క్రింద ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతిగా 50 శాతం జీతం ఈఎస్ఐ ద్వారా చెల్లిస్తామని కేంద్ర కార్మికశాఖ ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలో ఈఎస్ఐ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు, తమ ఈఎస్ఐ ఖాతా నెంబరు, ఆధార్ కాపీ, అఫిడవిట్, బ్యాంక్ వివరాలను సమర్పించవచ్చు. ఆన్లైన్లో లేదా పోస్టు ద్వారా కూడా నిరుద్యోగ భృతి కోసం ఈఎస్ఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన నిరుద్యోగులకు ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్కు 30 వరకు నిరుద్యోగ భృతి లభిస్తుంది. ఈసొమ్ము నేరుగా దరఖాస్తుదారుల బ్యాంక్ ఖాతాలోనే జామా అవుతుంది కనుక మళ్ళీ దాని కోసం ఈఎస్ఐ కార్యాలయం చుట్టూ తిరగనవసరం లేదు. ఎవరికీ లంచాలు చెల్లించనక్కరలేదు. దరఖాస్తు చేసుకోవడానికి పనిచేసిన సంస్థ యజమాని సంతకం కూడా అవసరం లేదు. ఉద్యోగులే తమ వివరాలను అఫిడవిట్ ద్వారా దృవీకరిస్తే చాలు.