బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్తో మొదలైన ఆత్మహత్యలు నేటికీ వరుసగా కొనసాగుతుండటం చాలా ఆందోళనకరంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తరువాత మరాఠీ నటుడు అశుతోష్ భాక్రే (32) గత నెలాఖరున నాందేడ్లో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇప్పుడు ముంబైలో టీవీ నటుడు సమీర్ శర్మ (44) తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను రెండురోజులుగా తన ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఆ అపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాచ్మెన్కు అనుమానం కలిగి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్ళి చూడగా సమీర్ శర్మ ఫ్యానుకు వ్రేలాడుతూ కనిపించాడు. అతను ఎటువంటి సూసైడ్ నోట్ వ్రాయకపోవడంతో ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సమీర్ శర్మ స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమవుతున్న ‘ఏ రిస్తా హై ప్యార్ కా’ అనే హిందీ సీరియల్లో నటిస్తున్నాడు.