తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొని ఉండగా, సింగరేణిలో జరిగిన ఘోరప్రమాదంలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో ఫేజ్-2లోని 1వ నెంబర్ గనిలో ఓబీ బ్లాస్టింగ్ చేసినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్ చేసిన కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు ప్రేలుడు ధాటికి ఘటనాస్థలంలోనే చనిపోయారు. సమీపంలో పనిచేస్తున్న మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు కార్మికులను హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటకు తీసారు. చనిపోయిన నాలుగవ వ్యక్తి మృతదేహం కోసం గాలిస్తున్నారు.