ఈరోజు జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఏసియా విమానం గాలిలో ఉండగా రెండు ఇంజన్లలో ఒక దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే పైలట్లు చాలా చాకచక్యంగా ఒకే ఇంజనుతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు, మరో ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు.
ఎయిర్ ఏసియాకు చెందిన ఏ-320 విమానం జైపూర్ నుంచి బయలుదేరినప్పుడు ఎటువంటి సాంకేతిక సమస్య కనబడలేదు. హైదరాబాద్ చేరుకొంటుండగా విమానానికి గల రెండు ఇంజన్లలో ఒక దానిలో ఆయిల్ లీక్ అవుతునట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే దానిని నిలిపివేసి ఒకే ఇంజనుతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.