ఆదిలాబాద్లో పట్టణంలో సోమవారం సాయంత్రం ఒకేసారి 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. స్థానిక సుందరయ్య నగర్, ఖుర్షీద్ నగర్కు చెందిన వారందరూ ఓ తోపుడుబండి వద్ద పానీపూరీ తిన్నారు. కొన్ని గంటల తరువాత అందరికీ వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దాంతో తల్లితండ్రులు వారిని రిమ్స్ ఆసుపత్రికి తీసుకువస్తుండటంతో ఆసుపత్రి సూపరిండెంట్ బలరాం బానోత్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన పానీపూరీ అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద మిగిలిన ఆహారపదార్దాలను స్వాదీనం చేసుకొన్నారు.
అస్వస్థతకు గురైన పిల్లలు అందరూ 5 నుంచి 10 ఏళ్ళ వయసులోపువారే కావడంతో తల్లితండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే పిల్లలందరూ పూర్తిగా కోలుకొన్నారని వారికి ఎటువంటి ప్రమాదం లేదని రిమ్స్ సూపరిండెంట్ బలరాం బానోత్ తెలిపారు.
లాక్డౌన్ కారణంగా రోడ్డు పక్కన అమ్మే పానీపూరీ, నూడుల్స్, పకోడీ, మిర్చీ బజ్జీలు వంటివి మిగిలిపోతుంటాయి. మిగిలిపోయిన వాటిని పారవేయకుండా మరునాడు అమ్ముకొనే ప్రయత్నం చేసినప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తుతుంటాయి. బహుశః నిన్న ఆదిలాబాద్లో అమ్మిన పానీపూరీలు కూడా అటువంటివే అయ్యుండవచ్చు. కనుక పిల్లలు పెద్దలూ కూడా రోడ్లపై అమ్మే అటువంటి చిరు తిండ్లలకు దూరంగా ఉంటే మంచిది.