ఛత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ప్రీతీవర్మ అనే మహిళకు మార్చి 27న కవలలు పుట్టారు. వారికి తల్లితండ్రులు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకొన్నారు. కరోనా (కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో కవలలు పుట్టారు కనుక పాపకు కరోనా అని బాబుకు కోవిడ్ అని పేర్లు పెట్టుకొన్నామని తల్లితండ్రులు చెప్పారు. కరోనా (కోవిడ్-19) వలన ప్రపంచానికి చాలా నష్టం జరుగుతున్నప్పటికీ అవి ప్రపంచదేశాలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంగా ఉండటం, కాలుష్య నివారణ, ప్రకృతి సమతౌల్యం పాటించడం వంటి అనేక కొత్త పాఠాలు నేర్పించాయని కనుక తమ పిల్లలకు వెరైటీగా ఈ పేర్లు పెట్టామని ఆ శిశువుల తల్లితండ్రులు చెప్పారు. కానీ యావత్ దేశప్రజలు ‘కరోనా మహమ్మారి’ అంటూ సంభోదిస్తున్నప్పుడు, వారు తమ పిల్లలకు ఆ పేర్లు పెట్టడం ఆశ్చర్యకరమే.