రంగారెడ్డిలో విద్యార్ధిని కిడ్నాప్‌కు ఆటో డ్రైవర్ విఫలయత్నం

September 13, 2019
img

హాజీపూర్ విషాద ఘటనలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఒంటరిగా పాఠశాలకు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులు మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకునేవరకు తల్లితండ్రులు భయంభయంగా ఎదురుచూడవలసివస్తోంది. 

రంగారెడ్డి జిల్లాలో అమనగల్ పట్టణంలో గురువారం 10వ తరగతి చదువుతున విద్యార్ధిని తృటిలో అత్యాచారం నుంచి తప్పించుకుని బయటపడింది. గురువారం ఉదయం ఆమె ఆటో ఎక్కి ఇంటికి తిరిగివెళుతుండగా ఆటో డ్రైవర్ ఆమెతో అసభ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు యువకులు కూడా ఆమెను తాకుతూ అసభ్యంగా మాట్లాడుతుండటంతో ఆమె భయంతో నడుస్తున్న ఆటోలో నుంచి దూకేసింది. ఇది గమనించిన స్థానికులు ఆ ఆటోను వెంబడించి ఆటో డ్రైవరును, దానిలో ఉన్న మరో ఇద్దరినీ పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు ఆ బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రధమచికిత్స చేయించారు. ఆటోను స్వాధీనం చేసుకొని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. 

ఆ బాలిక ధైర్యం చేసి నడుస్తున్న ఆటోలో నుంచి దూకేయడంతో స్వల్పగాయాలతో అత్యాచారం నుంచి తప్పించుకోగలిగింది. లేకుంటే ఆమె జీవితం నాశనం అయ్యుండేది. వారి చేతిలో ప్రాణాలు కూడా కోల్పోయి ఉండేదేమో? కనుక రాష్ట్రంలో విద్యార్ధినులకు, మహిళలకు రక్షణ కల్పించేందుకు షీ టీమ్స్ సంఖ్య మరింత పెంచవలసిన అవసరం కనబడుతోంది.   

 


Related Post