శరవణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఛైర్మన్ పి.రాజగోపాల్ గుండెపోటుతో మరణించారు. సుమారు 20 ఏళ్ళ క్రితం తన వద్ద పనిచేస్తున్న ఒక ఉద్యోగి కుమార్తెను ఆయన వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే ఆయన మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకొందామనుకున్న యువతికి కూడా పెళ్లైయింది. అయినప్పటికీ ఆమెను ఎలాగైనా సొంతం చేసుకొందామనే దురాలోచనతో 2001లో ఆమె భర్తను హత్య చేయించాడు. ఆ హత్య కేసు దేశవ్యాప్తంగా చాలా సంచలనం సృష్టించింది.
అప్పటి నుంచి అనేక ఏళ్లపాటు సాగిన ఆ కేసులో మద్రాస్ హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జీవితఖైదు విదించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించడమే కాక దానిని యావజీవితకారాగార శిక్షగా మార్చి తక్షణమే పోలీసులకు లొంగిపోవలసిందిగా ఆయనను ఆదేశించింది. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం దెబ్బ తినడంతో జూలై 9వ తేదీన ఆక్సిజన్ మాస్క్ ధరించి అంబులెన్స్ లో వచ్చి కోర్టులో లొంగిపోయారు.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు పులళ్ జైలుకు తరలించారు. నాలుగు రోజుల తరువాత ఆయనకు గుండెపోటు రావడంతో పోలీసులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ గుండెపోటు కారణమగా రాజగోపాల్ చనిపోయారు. శరవణ హోటల్స్ ఒక్క తమిళనాడుకే పరిమితం కాలేదు. దేశవిదేశాలలో శరవణ హోటల్స్ స్థాపించి ఎంతో పేరు, డబ్బు సంపాదించారు. కానీ స్త్రీలోలత్వం కారణంగా కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు, గౌరవం మంట గలిసాయి. చివరికి ప్రాణాలు కూడా పోయాయి.