బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం భాగ్యనగర్ శ్రీమహంకాళీ బోనవ ఉత్సవ కమిటీ సభ్యులు బెజవాడ కనకదుర్గమ్మకు ఆదివారం బోనం సమర్పించుకున్నారు. ముందుగా ఏపీ దేవాదాయశాఖా మంత్రి వేలంపల్లి శ్రీనివాస్, ఆలయ ఈవో వి కోటీశ్వరమ్మ, భాగ్యనగర్ బోనవ ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ఆనవాయితీ ప్రకారం బ్రాహ్మణవీధిలో ఉన్న జమ్మిచెట్టువద్ద పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించారు. వారందరికీ ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు ఆదరంగా స్వాగతం పలికారు. జమ్మిచెట్టు వద్ద నుంచి ఆలయం వరకు సాగిన ఊరేగింపులో 1,000 మంది తెలంగాణ కళాకారులు, పోతురాజుల ప్రదర్శనలు విజయవాడ ప్రజలను చాలా ఆకట్టుకున్నాయి.