నేటి నుంచి మూడు రోజుల పాటు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు విష్వక్సేన పూజాకార్యక్రమంతో జయంతి ఉత్సవాలు మొదలవుతాయి. అనంతరం ఉదయం 10.30 గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చాన, 11.30 గంటలకు తిరువెంకటపతి అలంకార సేవ నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు. మళ్ళీ సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణం చేసి మృత్స్యంగ్రహణం, చతుస్థానార్చన, మూర్తి కుంభస్థాపన, మూల మంత్రహవనం చేస్తారు. రాత్రి 8.30 గంటలకు స్వామివారిని పరవాసుదేవ అలంకారంలో గరుడవాహనంపై ఆలయ మాడవీదులలో ఊరేగిస్తారు.
స్వామివారి జయంతి ఉత్సవాల సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 20 మంది ఋత్విక్కులు స్వామివారి మూలమంత్ర జపం చేస్తారు. ఈ మూడు రోజులపాటు స్వామివారికి నిత్యం జరిగే కొన్ని శాస్విత పూజలు, అలాగే భక్తుల ప్రత్యేక పూజలను నిలిపివేసినట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. నేటి నుంచి యాదాద్రిలో బెల్లంతో చేసిన లడ్డూలను విక్రయించనున్నారు. వంద గ్రాములు బరువుండే ఒక్కో బెల్లం లడ్డూ ధర రూ.25గా నిర్ణయించమని చెప్పారు.