ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్స్ నేరెళ్ళ వేణు మాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. అయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు.
నేరెళ్ళ వేణు మాధవ్ 1932, డిసెంబర్ 28న వరంగల్ జిల్లాలోని మట్టెవాడ గ్రామంలో జన్మించారు. చిన్నవయసులోనే ఆయనలోని ప్రతిభ బయటపడింది. మొదట నాటకరంగంలో ప్రవేశించి అనేక నాటకాలలో నటించారు. ఆ తరువాత దేశవిదేశాలలోని సినీ నటీనటుల గొంతులను అనుకరించి మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు. కొంతకాలం హన్మకొండలోని జిసిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తరువాత 1972-78వరకు ఆరేళ్ళపాటు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు.
మిమిక్రీ రంగంలో ఆయనకు ఆయనే సాటి. అయన ప్రతిభను గుర్తించిన కాకతీయ, ఆంధ్రా, ఇగ్నో యూనివర్సిటీలు ఆయనను డాక్టరేట్ తో సత్కరించాయి. 2001లో కేంద్రప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అయన గౌరవార్ధం పోస్టల్ శాఖ అయన పేరుతో స్టాంప్ విడుదల చేసింది. తెలంగాణా ప్రభుత్వం కూడా ఆయనను విశిష్ట పురస్కారంతో గౌరవించింది. తెలంగాణా సిఎం కెసిఆర్ అయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. నేరెళ్ళ వేణు మాధవ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.