వాళ్ళు మానసిక వికలాంగులు...అందుకే చంపేశా...

June 16, 2018
img

నానాటికీ మనుషులలో మానవత్వం ఎంతగా దిగజారిపోతోందో తెలియజేస్తోంది హైదరాబాద్ లో జరిగిన ఈ దారుణం. నల్గొండ మిర్యాలగూడాలో నివసిస్తున్న శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి దంపతులకు 12 ఏళ్ళు వయసున్న సృజనారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి అనే కవలలున్నారు. ఆ అక్కా తమ్ముళ్ళను వారి మేనమామే హత్య చేశాడు. 

మల్లికార్జున్ రెడ్డి వారిరువురినీ శుక్రవారం హైదరాబాద్ లో చైతన్యపురిలో తను అద్దెకు ఉంటున్న గదికి తీసుకువచ్చాడు. తన రూమ్ మేట్ వెంకట్రామిరెడ్డి సహాయంతో వారిద్దరినీ హత్య చేశాడు. అర్ధరాత్రి దాటినా తరువాత వారిద్దరి శవాలను బయట సిద్దంగా ఉంచిన కారులోకి ఎక్కిస్తుండగా అదే సమయానికి బయటకు వచ్చిన ఇంటి యజమాని అది చూసి వారిని ప్రశ్నించడంతో ‘పిల్లల ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని’ మల్లికార్జున రెడ్డి జవాబు చెప్పాడు. కానీ ఇంటి యజమానికి వారి తీరు చూసి అనుమానం కలిగి పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడకు చేరుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. 

పుట్టుకతోనే వారిరువురూ మానసిక వికలాంగులని వారి వలన తన సోదరి చాలా బాధపడుతోందని ఆమెకు ఆ బాధ నుంచి విముక్తి కల్పించడానికి వారిరువురినీ హత్య చేశానని మల్లికార్జున రెడ్డి పోలీసులకు తెలిపాడు.

పోలీసులు మల్లికార్జున రెడ్డి, వెంకట్రామిరెడ్డి, కారుడ్రైవర్ వివేక్ రెడ్డి ని అరెస్ట్ చేసి శవాలను పోస్ట్ మార్టంకు పంపించారు. ఈ విషయం మంచిర్యాలలోని వారి తల్లితండ్రులకు తెలియజేశారు. 

ఇంకా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ఆ కవలల తల్లితండ్రులకు పోలీసులు ఈ విషయం తెలియజేసినా వారు మల్లికార్జున రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయలేదు. “పోయిన పిల్లలు ఎలాగూ పోయారు కనుక తమ్ముడిని శిక్షించి ఏమి ప్రయోజనం? కనుక అతనిని విడిచిపెట్టేయాలని ఆ పిల్లల తల్లి లక్ష్మి పోలీసులను కోరింది. అంటే ఆ తల్లితండ్రులే తమ పిల్లలిద్దరినీ వదిలించుకోవడానికి మల్లికార్జునరెడ్డితో హైదరాబాద్ కు పంపించారా? వారిని హత్య చేయడానికి అతని సహాయం తీసుకున్నారా? అని అనుమానం కలుగడంతో పోలీసులు ఆ దంపతులను కూడా ప్రశ్నిస్తున్నారు. 

అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను మానసిక వికలాంగులు అనే కారణంతో హత్య చేసి వదిలించుకోవాలనుకోవడం చాలా దారుణమే కదా! 

Related Post