ముఖ్యమంత్రి కెసిఆర్ తుపాకులపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బరాజ్ లు, కన్నెపల్లి, శ్రీపురం,గోలివాడ పంపు హౌసుల పనుల పురోగతిని పరిశీలించడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్ ద్వారా కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణా భవన్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ చేరుకొంటారు. రాత్రికి అక్కడే బసచేసి రేపు ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి తుపాకులపల్లి బరాజ్ చేరుకొంటారు. అక్కడ బరాజ్ పనులను పరిశీలించిన తరువాత మేడిగడ్డ చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు.
అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్ళి దానిని పరిశీలించిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నారం బరాజ్ చేరుకొంటారు. అక్కడి నుంచి శ్రీపురం పంప్ హౌస్ పరిశీలించిన తరువాత అక్కడే భోజనం చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 1.30 గంటలకు సుందిళ్ళ బ్యారేజ్, గోలివాడ పంప్ హౌస్ పరిశీలించిన తరువాత, సాయంత్రం 4.15 గంటలకు రామగుండంలో ఎన్టీపిసి గెస్ట్ హౌస్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.