మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారు

November 22, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని నరేంద్ర మోడీ 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం మోడీ హెలికాఫ్టర్ లో మిగిలినవారందరూ రోడ్డు మార్గంలో మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ కు చేరుకొంటారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభిస్తారు. తరువాత మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు మెట్రో రైలులో ప్రయాణించి మళ్ళీ అదే రైలులో మియాపూర్ కు తిరిగివస్తారు.మియాపూర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన మెట్రో సర్వీస్ ఛాయాచిత్రాలను చూసిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ హెలికాఫ్టర్ ద్వారా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగబోయే హెచ్.ఐ.సి.సి.కి చేరుకొంటారు. ప్రారంభోత్సవం తరువాత రాత్రి ఏడు గంటలకు ఫలక్ నూమా ప్యాలెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందులో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గాన్న రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో డిల్లీ తిరుగు పయనం అవుతారు.       



Related Post