నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం భర్తీ చేయడానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక వాటి గురించి ప్రతిపక్షాలు వాటి నేతల హడావుడి మొదలైపోయింది. తెలంగాణా భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిన్న సిద్ధిపేటలో విలేఖరులతో మాట్లాడుతూ, “నల్లగొండ లోక్ సభ ఉపఎన్నికలలో మా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఉపఎన్నికలు ఒక ట్రయల్ రన్ లాగ ఉపయోగపడతాయని భావిస్తున్నాను. అయితే ఒక్క నల్లగొండలో మాత్రమే కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలందరి చేత రాజీనామాలు చేయించి అన్నిచోట్ల ఉపఎన్నికలు జరిపించాలని మేము తెరాస సర్కార్ ను డిమాండ్ చేస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి రహితమైన పాలనకు తెలంగాణా ప్రజలు బ్రహ్మరధం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. అన్ని చోట్ల ఒకేసారి ఉపఎన్నికలను నిర్వహించినట్లయితే అది రుజువు అవుతుంది,” అని అన్నారు.