డ్రగ్స్ కేసులలో సినీ ప్రముఖుల విచారణ కొనసాగుతున్న కొద్దీ రోజూ కొత్తకొత్త పేర్లు బయటపడుతున్నాయి. తాజాగా తెలుగు సినీపరిశ్రమలో నెంబర్: 1 హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ వద్ద మేనేజర్ గా పనిచేస్తున్న జోసఫ్ అనే వ్యక్తి పేరు బయటపడటంతో సిట్ అధికారులు అతనిని నిన్న అరెస్ట్ చేశారు.
సిట్ అధికారులు మొట్టమొదట దర్శకుడు పూరీ జగన్నాథ్ ను విచారణ చేసినప్పుడే అతని పేరు బయటపడినట్లు సమాచారం. ఆ సంగతి తెలుసుకొని అతను అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతనికోసం గాలిస్తున్న సిట్ అధికారులు చివరికి అతనిని నిన్న అరెస్ట్ చేసినట్లు తాజా సమాచారం. అతనితో కలిపి ఈ కేసులలో ఇంతవరకు మొత్తం 19మందిని సిట్ అరెస్ట్ చేసింది.
జోసఫ్ ఇంతకు ముందు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి దగ్గర మేనేజర్ గా చేసేవాడు. అతను చాలా కాలం నుంచే డ్రగ్స్ సరఫరా చేసేవాడని సిట్ విచారణలో తేలింది. అతను లావణ్యా త్రిపాఠి వద్ద మానేసిన తరువాత సినీపరిశ్రమలో నెంబర్: 1 హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ వద్ద చేరిన తరువాత కూడా తన ఈ సైడ్ బిజినెస్ మానుకోకపోవడంతో చివరికి కటకటాలు పాలయ్యాడు. అయితే తన మేనేజర్ డ్రగ్స్ సరఫరా చేస్తాడనే సంగతి బహుశః కాజల్ అగర్వాల్ కు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే మేనేజరుగా ఉంచుకొంది. అతని సంగతి ఆమె పసిగట్టలేకపోయినా ఎక్సైజ్ శాఖా అధికారులు తెలుసుకొని అరెస్ట్ చేశారు. ఇది కాజల్ అగర్వాల్ కు చాలా దిగ్ర్భాంతి కలిగించే విషయమే అని భావించవచ్చు.