వేతన సవరణ కొరకు ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. ఒకటి రెండు రోజులలోగా పీఆర్సీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమీటీని ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యి చర్చించాలని, పదిరోజులలోపు చర్చలు ముగించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. దాని ఆధారంగా ఫిబ్రవరి రెండో వారంలోగా పీఆర్సీని సిఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించాలని భావిస్తున్నారు.
పీఆర్సీ కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ బిశ్వాల్ కమిటీ డిసెంబర్ 31వ తేదీన సోమేష్ కుమార్కు నివేదిక అందజేసింది. దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సోమేష్ కుమార్ నేతృత్వంలో రామకృష్ణారావు, కె. రజత్కుమార్లతో ప్రభుత్వం త్రిసభ్య కమీటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కానీ ఇంతవరకు ఆ కమిటీ సమావేశం కాకపోవడంతో మళ్ళీ ఉద్యోగసంఘాల నేతలే సోమేష్ కుమార్ను కలిసి పీఆర్సీ గురించి గుర్తు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కొందరు మహిళా ఉద్యోగులు ప్రగతి భవన్కు వెళ్ళి సిఎం కేసీఆర్ను కలిసి పీఆర్సీ గురించి గుర్తు చేయడంతో ఆయన వెంటనే స్పందించి ఉద్యోగ సంఘాల నేతలతో పీఆర్సీపై చర్చలు జరపాలని సోమేష్ కుమార్ను ఆదేశించారు. కనుక ఫిబ్రవరి నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.