నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి మృతి

January 21, 2021


img

నల్గొండ జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట వద్ద వ్యవసాయ కూలీలను తీసుకువెళుతున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టడంతో దానిలో ప్రయాణిస్తున్న ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరుతో సహా ఐదుగురు మహిళలు చనిపోయారు. కూలీలతో వెళుతున్న ఆటో అంగడిపేట వద్దకు చేరుకొన్నప్పుడు ఎదురుగా బోలెరో వాహనం వచ్చింది. దానిని తప్పించడానికి ఆటోను పక్కకు తిప్పినప్పుడు ఎదురుగా దూసుకువచ్చిన లారీ ఢీకొనడంతో దానిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో మొత్తం 21 మంది వ్యవసాయకూలీలు ఉన్నారు. వారందరూ ఉదయం అదే ఆటోలో పొరుగునే ఉన్న రంగారెడ్డిగూడెంలో వరినాట్లకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారే కావడంతో తండాలో తీవ్రవిషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారిని, మృతులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

     

చనిపోయినవారి వివరాలు: ఆటో డ్రైవర్ మల్లేశం, మల్లమ్మ, కొట్టం పెద్దమ్మ, నోమల పెద్దమ్మ, నోమల సైదమ్మ, గొడుగు ఇద్దమ్మ. 


Related Post