సిఎం కేసీఆర్ బందువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన భూమా అఖిలప్రియకు గురువారంతో పోలీస్ కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం పోలీసులు ఆమెను బేగంపేటలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాత గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి అన్ని వైద్య పరీక్షలు జరిపించారు. ఆమెకు కరోనా లేదని నిర్ధారించుకున్న తరువాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం పోలీసులు ఆమెను చంచల్గూడా జైలుకి తరలించారు.
మూడురోజుల పోలీసుల కస్టడీలో ఉన్న అఖిలప్రియ మొదట పోలీసుల అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని తర్వాత కొన్నిటికి మాత్రమే సమాధానం ఇచ్చిందని పోలీసులు తెలిపారు. కానీ ఆమె నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇచ్చిన సమాచారంతో నగరంలో పలు చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవరామ్తో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆమె న్యాయవాది ఈరోజు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈనెల 16న విచారణ జరుపుతామని న్యాయమూర్తి తెలిపారు.
హఫీజ్పేటలో ఉన్న 25 ఎకరాల భూవివాద పరిష్కారానికి తన ప్రతినిధులు ప్రవీణ్ రావు సోదరులు చర్చలకు ప్రయత్నిస్తున్నారని కానీ వారు అందుకు అంగీకరించడంలేదని అఖిలప్రియ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.