రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్’ వ్యాఖ్యలతో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్-బిజెపిల మద్య పెద్ద యుద్ధం మొదలైంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ్ళ ఉదయం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, “హైదరాబాద్లో 75,000 మంది రోహ్యింగాలునట్లు కేంద్రానికి సమాచారం ఉంటే తక్షణమే వారిని గుర్తించి వెనక్కు తిప్పి పంపించేయొచ్చు కదా?కేంద్రప్రభుత్వం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారు కదా?ఈ విషయం జీహెచ్ఎంసీ ఎన్నికలలు వచ్చే వరకు ఆయనకు కూడా తెలియదా? నగరంలోని ప్రశాంత వాతావరణాన్ని పాడు చేసేందుకు బిజెపి నేతలు కంకణం కట్టుకొన్నట్లున్నారు. కేంద్రమంత్రులు కూడా చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారానికి ఇవాళ్ళ హైదరాబాద్ నగరానికి వచ్చిన స్మృతీ ఇరానీ కూడా ఇదే విషయంపై మాట్లాడినప్పుడు, “హైదరాబాద్లో 75,000 మంది రోహ్యింగాలునట్లు మీకు సమాచారం ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. వారిని గుర్తించి ఎందుకు వెనక్కు తిప్పి పంపలేదు?” అని విలేఖరులు ప్రశ్నించారు. దానికి ఆమె చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు.
“ఇది శాంతిభద్రతల సమస్య కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కానీ టిఆర్ఎస్కు మజ్లీస్ పార్టీతో దోస్తీ చేస్తున్నందున రోహ్యింగాలను చూసిచూడనట్లు వదిలిస్తోంది. టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలు వారితో తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలనుకొంటున్నాయి,” అని బదులిచ్చారు.