కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ్ళ హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పదేపదే టిఆర్ఎస్-మజ్లీస్ అనైతిక బంధం, నగరంలో అక్రమంగా స్థిరపడిన రోహింగ్యాల గురించి ప్రస్తావించారు.
“టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలు పాతబస్తీలో అభివృద్ధి జరుగకుండా చేస్తూ అక్కడి నిరుపేద ముస్లిం ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాయి. వారు పేదరికంలో మగ్గుతుంటేనే తమను గౌరవిస్తారని, ఓట్లేసి గెలిపిస్తారని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. నగరంలో తమ ఓటు బ్యాంకును పెంచుకొనేందుకు అక్రమంగా దేశంలోకి జొరబడిన రోహింగ్యాలను, పాకిస్తానీలకు ఆ రెండు పార్టీలు ఆశ్రయం కలిపిస్తున్నాయి. హైదరాబాద్లో సుమారు 75,000 మంది రోహింగ్యాలున్నట్లు మాకు సమాచారం ఉంది. మనదేశంలో శత్రువులు చొరబడకుండా మన సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసరిహద్దులను కాపాడుతుంటే ఇక్కడ టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలు దేశంనడిబొడ్డున హైదరాబాద్ నగరంలో తమ స్వలాభం కోసం వేలాదిమంది రోహింగ్యాలను చేరదీస్తుండటం చాలా బాధాకరం.
తమకు పాతబస్తీలో ఆశ్రయమిచ్చి ఓటు హక్కు కల్పించినందుకు రోహింగ్యాలు మీడియా సమక్షంలోనే అసదుద్దీన్ ఓవైసీకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అది ఓ ఇటీవల ఓ స్థానిక, ఛానల్లో, ఓ జాతీయ టీవీ ఛానల్లో ప్రసారమయ్యింది కూడా. ఇంత బహిరంగంగా రోహింగ్యాలకు నగరంలో ఆశ్రయం కల్పించి వారికి ఓటు హక్కు కూడా కల్పిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తోంది? టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీల మద్య అవగాహన ఉంది కనుకనే తెలంగాణ ప్రభుత్వం రోహింగ్యాలకు ఆశ్రయం కల్పిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలు తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించడం వలన శాంతిభద్రతల సమస్యలు తలెత్తడమే కాకుండా, వారి వలన హైదరాబాద్ పౌరులకు దక్కవలసిన హక్కులు, ఫలాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
నగరంలోని మన పౌరుల హక్కులను కాపాడేందుకు అటువంటివారిని ఏరిపారేస్తామంటే టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి? ఎంతో గొప్ప నగరమైన మన భాగ్యనగరాన్ని కాపాడుకొనేందుకు బిజెపి కట్టుబడి ఉంది” అని అన్నారు.