జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ్ళ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. దానిలో ముఖ్యాంశాలు:
వరదబాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ. 50,000 నష్టపరిహారం చెల్లిస్తాం.
వరదలలో పూర్తిగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.5 లక్షలు, పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.2.5 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తాం.
అర్హత కలిగిన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తాం. వీటికోసం నగరంలో మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తాం.
సొంతజాగా ఉన్నవాళ్లకు ఇళ్ళు నిర్మించుకొనేందుకు రూ. 8 లక్షలు, ఒక బెడ్ రూమ్ ఇల్లున్నవారికి మరో బెడ్ రూమ్ వేసుకొనేందుకు రూ.4 లక్షలు ఆర్ధికసాయం ఇస్తాం.
80 గజాల లోపు ఇళ్ళున్నవారికి ఆస్తిపన్ను పూర్తిగా రద్దు చేస్తాం.
ప్రతీ ఇంటికి 100 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు ఉండదు.
ప్రతీ ఇంటికీ నెలకు 30,000 లీటర్ల త్రాగునీటి ఉచితంగా అందిస్తాం.
మహిళలు, వృద్ధులు, వికలాంగులకు మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
ఉచిత ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ విధానాలను అమలుచేస్తాం.
కేబిల్ టీవీ ఆపరేటర్లకు పోల్ ఫీజు మాఫీ చేస్తాం.
మార్చి నుంచి సెప్టెంబర్ వరకు (లాక్డౌన్ సమయం) మోటారువాహనాల పన్ను రద్దు చేస్తాం.
పారిశుద్య కార్మికులకు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున భీమా చేయిస్తాం.
నగరంలో మురికివాడలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
నగరంలో కొత్తగా 5,000 కిమీ మేర మురికి కాలువలు, వరదనీటి కాలువలను నిర్మిస్తాం.
టీఎస్ఆర్టీసీని కాపాడుకొనేందుకు, నగర ప్రజలకు తక్కువధరలో ప్రయాణించేందుకు బస్సుల సంఖ్యను పెంచుతాము. నగరం నలుమూలలకు బస్సులను తిప్పుతాం.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు గట్టిగా కృషి చేస్తాం.
నగరంలో అన్నపూర్ణా క్యాంటీన్ల సంఖ్యను పెంచుతాం.
నగరంలో కొత్తగా గ్రంధాలయాలను ఏర్పాటు చేసి వాటిలో వికలాంగులకు ఉద్యోగాలు కల్పిస్తాం.
లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలకు, వ్యాపారసంస్థలకు పన్ను రాయితీలు ఇస్తాం.
ధరణీ పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం.
కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చి హైదరబాద్ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.