లాక్డౌన్ సమయంలో టీఎస్ఆర్టీసీ కూడా మూతపడటంతో మార్చి,
ఏప్రిల్, మే నెల జీతాలలో 50 శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లు విడుదల చేసింది. దానితో
పాటు సమ్మెకాలంలో 12 రోజుల వేతన బకాయిలను కూడా చెల్లించనుంది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యం
ఆ సొమ్మును ఈనెల 23న కార్మికుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమా చేస్తుంది. అలాగే ఆర్టీసీ
ఉద్యోగుల క్రెడిట్-కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన రూ. 784 కోట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం
వాడుకొంది. దానిలో ఇప్పటి వరకు మొత్తం రూ.200 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.584
కోట్లు కూడా వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఇది వరుస ఎన్నికల ప్రభావమో ఏమో తెలియదు కానీ గత ఏడాదిగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది కనుక వారికిది చాలా సంతోషకరమైన వార్తే.