దుబ్బాక ఉపఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోయింది. దుబ్బాకలో ఓటర్లకు డబ్బు పంచుతున్నాయంటూ టిఆర్ఎస్, బిజెపి పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఈ నేపధ్యంలో పోలీసులు నాలుగు రోజుల క్రితం బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బందువుల ఇళ్ళలో సోదాలు చేసారు. ఇవాళ్ళ ఉదయం దుబ్బాకలోని టిఆర్ఎస్ నేతల ఇళ్ళలో కూడా పోలీసులు సోదాలు చేశారు.
దుబ్బాక జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి శ్రీలేఖరాజు, సిద్ధిపేట మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, సిద్దిపేట పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డిల ఇళ్ళతో పాటు మరికొందరు రాజకీయనేతల ఇళ్ళలో పోలీసులు సోదాలు చేశారు. కానీ తనికీలలో డబ్బు, మద్యం, ఓటర్లకు పంచిపెట్టే వస్తువులు ఏవీ దొరకలేదని పోలీసులు తెలిపారు.