తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ధరణి పోర్టల్ను సిఎం కేసీఆర్గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభించనున్నారు. మూడుచింతలపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ధరణీని సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. కనుక ఆ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చేవారి కోసం కార్యాలయం ఎదుట భారీ ఎల్ఈడీ స్క్రీన్లు అధికారులు ఏర్పాటు చేశారు.
ధరణీ ప్రారంభోత్సవం తరువాత సిఎం కేసీఆర్ ప్రజలనుద్దేశ్యించి ప్రసంగిస్తారు. నేటి నుంచి రాష్ట్రంలో అమలులోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, నూతన రిజిస్ట్రేషన్ విధివిధానాల గురించి సిఎం కేసీఆర్ ఆ సభలో ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు ధరణి పోర్టల్ ప్రారంభమవుతుంది కనుక నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ వ్యవసాయ, వ్యవయసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభం అవుతాయి. ఇక నుంచి రాష్ట్రంలో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్స్ అన్నీ తప్పనిసరిగా ధరణీలో నమోదవుతుంటాయి. ధరణిలో నమోదు కాగానే ఆటోమేటిక్గా ఆస్తులను అమ్మినవారి స్థానంలో కొనుగోలుచేసిన యాజమానుల పేర్లు, వారి పూర్తి వివరాలు కూడా నమోదవుతుంటాయి. కనుక ఇక నుంచి యాజమాన్యపు హక్కులు బదిలీ పత్రాల (మ్యూటేషన్ సర్టిఫికేట్) కోసం ఎవరూ కార్యాలయాల చుట్టూ తిరుగక్కరలేదు. వెంటనే తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మ్యూటేషన్ సర్టిఫికేట్ ధరణి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే ధరణిలోకి లాగిన్ అయ్యి ఆ వివరాలను చూసుకోవచ్చు. కావాలనుకొంటే ఆ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆస్తులకు సంబందించి ఏవైనా సమస్యలున్నట్లయితే ధరణి ద్వారానే పిర్యాదుచేస్తే చాలు వెంటనే పరిష్కరించబడతాయి.