రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల మద్య రూట్లు, కిలోమీటర్ల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా దసరా పండుగ సీజన్ మొదలైపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మద్య ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. పైగా తగినన్ని రైళ్ళు కూడా లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి. కనుక టీఎస్ఆర్టీసీ అధికారులు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మరియు ఏపీ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు విజ్ఞప్తి చేసారు.
తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ 1.04 కిమీ మేర సర్వీసులు తగ్గించుకోవడానికి, విజయవాడ-హైదరాబాద్ రూట్లో 322 బస్సులను తగ్గించుకోవడానికి అంగీకరించామని అన్నారు. కనుక అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభించేందుకు తక్షణమే నిర్ణయమే తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ ఆలస్యం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకు రూ.3.50 కోట్లు నష్టం జరుగుతోందన్నారు.