తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ధరణీ పోర్టల్ ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆరోజు నుంచే ప్రజలకు, అధికారులకు అందరికీ ధరణీ పోర్టల్ అనుబాటులోకి వస్తుంది. ఆ రోజు వరకు దానిలో నమోదైన ప్రజల ఆస్తుల వివరాలన్నీ కనబడతాయి. ఇంకా నమోదు కాని ఆస్తి వివరాలను ధరణీలో ప్రజలు ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాగానే పాత యజమాని స్థానమో కొత్త యజమాని పేరు, ఆస్తి పూర్తి వివరాలు ధరణీలో ప్రత్యక్షమవుతాయి. వాటిని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. కావాలనుకొంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ధరణీ వెబ్సైట్ ప్రారంభించడం కోసమే గత నెలరోజులు రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రక్రియను నిలిపివేసింది ప్రభుత్వం. ఇప్పుడు ధరణీ వెబ్సైట్ ప్రారంభం కాబోతోంది కనుక ఆ రోజు నుంచి మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానున్నాయి.