హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంపై కాంగ్రెస్, టిఆర్ఎస్ల మద్య డెయిలీ సీరియల్లా మాటల యుద్ధం జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించామని టిఆర్ఎస్ ప్రభుత్వం దొంగలెక్కలు చెపుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కాంగ్రెస్ నేతలు మా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు దేనికోసమో తెలుసు. అయినా జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో 150 మంది అభ్యర్ధులున్నారా? లేనప్పుడు ఇంక ఈ సవాళ్ళు, ఆరోపణలు దేనికి? మా ప్రభుత్వం హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మిస్తోందో జాబితాను కాంగ్రెస్ నేతలకు అందజేశాము. వారు కావాలంటే వెళ్ళి ఆ జాబితాలో పేర్కొన్నట్లు ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా పరిశీలించుకోవచ్చు. దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తోంది. మా ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటుంది కనుకనే ఎన్ని కష్టానష్టాలు ఎదురవుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మిస్తోంది. ఇక ముందు కూడా నిర్మించి పేదలకు ఇస్తూనే ఉంటాము,” అని అన్నారు.