త్వరలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం

September 17, 2020


img

భారత్‌కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు బ్రిటిష్ కాలంలో నిర్మించిన పార్లమెంటు భవనాన్నే సమావేశాలకు వినియోగిస్తున్నాయి. అయితే ప్రస్తుత, మరియు భవిష్య అవసరాలకు తగినట్లుగా కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని భావించిన కేంద్రప్రభుత్వం ఈ ఏడాది మొదట్లోనే ఆ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దాంతో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. దాని కోసం కేంద్ర ప్రజాపన్నుల శాఖ బుదవారం డిల్లీలో ఆర్ధికవేలంపాటను నిర్వహించగా, దానిలో పాల్గొన్న ఎల్&టి సంస్థ రూ. 865 కోట్లు కోట్ చేయడంతో, టాటా సంస్థ దాని కంటే కొద్దిగా తక్కువ అంటే రూ. 861.90 కోట్లు కోట్ చేయడంతో ప్రతిష్టాత్మకమైన ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకొంది.

ప్రస్తుతం వినియోగిస్తున్న పార్లమెంటు భవనానికి సమీపంలో గల పార్లమెంట్‌ హౌస్‌ ఎస్టేట్‌లోని 118వ నెంబర్‌ ప్లాట్‌లో కొత్త పార్లమెంటు భవనం నిర్మించబడుతుంది. మొత్తం 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నిర్మించబోయే కొత్త పార్లమెంటు భవనంలో గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు ఉంటాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియగానే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగిస్తున్న పార్లమెంటు భవనానికి అవసరమైన మరమత్తులు చేసి దానిని వేరే అవసరాలకు వినియోగించుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. 



Related Post