అమెరికా, లండన్, జర్మనీ మరికొన్ని దేశాల నుంచి భారత్కు విమానాలను అనుమతించినందున విదేశాల నుంచి వచ్చేవారికి కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ ఆదివారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
1. విదేశాల నుంచి వచ్చేప్రయాణికులు తప్పనిసరిగా ఇకపై ప్రభుత్వం గుర్తించిన క్వారెంటైన్ కేంద్రాలలో డబ్బులు చెల్లించి (పెయిడ్ ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్) వారం రోజులు ఉండాలి. ఆ తరువాత మరో వారం రోజులు హోం క్వారెంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఆవిధంగా ఉంటామని ముందే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి.
2. కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, లేదా దీర్గకాలిక వ్యాదులతో బాధపడుతున్నవారున్నా లేదా వృద్ధులు, గర్భిణులు, 10 ఏళ్ళలోపు వయసున్న పిల్లలున్నా అటువంటి ప్రయాణికులు భారత్ చేరుకొన్న తరువాత తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి. బోర్డింగ్కు మూడు రోజులు ముందు వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
3. బోర్డింగ్కు నాలుగురోజులలోపుగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ అని నిర్ధారణ అయితే వారు ఆ రిపోర్ట్ భారత్లో ఎయిర్ పోర్ట్ అధికారులకు చూపించి పెయిడ్ క్వారెంటైన్ నుంచి మినహాయింపు పొందవచ్చు. కానీ తప్పనిసరిగా 14 రోజులు హోం క్వారెంటైన్లో ఉండాలి.
4. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే బోర్డింగ్కు అనుమతిస్తారు.
5. తప్పనిసరిగా ఆరోగ్యసేతు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
6. ఇతరదేశాల నుంచి భూ, సముద్రమార్గంలో వచ్చేవారికి కూడా ఈ నిబందనలే వర్తిస్తాయి.
7. ప్రయాణసమయంలో ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనబడితే భారత్ చేరుకోగానే వారిని నేరుగా కరోనా ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తారు.
8. ప్రయాణసమయంలో కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలి.