కేసీఆర్‌ ఏరి? విజయశాంతి

July 07, 2020


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత విజయశాంతి ట్విట్టర్‌ వేదికగా సిఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. మొదట పారాసిటమాల్ మాత్రా వేసుకొంటే కరోనా రాదని చెప్పిన సిఎం కేసీఆర్‌, ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపుతప్పగానే చేతులెత్తేసి గజ్వేల్ వెళ్లిపోయారని విమర్శించారు. కేసీఆర్‌ గురించి ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...  

తెలంగాణలో కరోనా టెస్ట్‌లు, చికిత్స వ్యవస్థలు పూర్తిగా గాడి తప్పినట్టు హైకోర్టు వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. శాంపిల్స్ సేకరణ, ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం... ఇదయ్యాక చికిత్స అందిస్తున్న తీరు జనాన్ని అయోమయంలోకి నెడుతున్నాయి.

చికిత్స చేయించుకుంటూ ప్రాణాలొదిలిన జర్నలిస్ట్ మనోజ్... "చనిపోతున్నాను డాడీ…బైబై" అంటూ ప్రాణం విడిచిన రవికుమార్... ఇలా ఎన్నో సంఘటనలు కరోనా చికిత్స విషయంలో కేసీఆర్ దొర సర్కారు పనితీరులోని డొల్లతనాన్ని ఎండగడుతున్నాయి.

హెల్త్ బులిటెన్స్‌లో అసమగ్ర సమాచారం, దారితప్పిన ఐసీఎంఆర్ నిబంధనలు, ఉన్నతాధికారుల సమాచారంలో సమన్వయ లోపం, ఇలా అన్ని విషయాల్లోనూ వైఫల్యమే. ఇదిగాక మాస్క్ లేకుండా తిరిగేవారిపై హైదరాబాదులో 70 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసులు మాస్కులు లేకుండా, కనీస భౌతిక దూరం పాటించని దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి. మీరే ఇలా ఉంటే ఇక ప్రజలకు ఎలా మార్గదర్శకులవుతారో... పరిస్థితిని ఎలా కంట్రోల్ చేస్తారో ఆ దేవుడికే తెలియాలి.

 శిశుపాలుడి తప్పుల్లా తెలంగాణ సీఎం కేసీఆర్ గారి తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రజాతీర్పు తనకే అనుకూలమని విర్రవీగుతున్న దొరగారికి... ప్రజల తిరస్కారం, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్ల పడ్డాయని తాజా పరిణామాలతో అర్థమవుతోంది.

ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలిస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కెసిఆర్ గారు... కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్‌గా మారింది.

కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దొరగారు దాన్ని అవహేళన చేశారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కెసిఆర్ గారు శాపనార్థాలు పెట్టారు.

కరోనా పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దొరగారు దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ ఇసై గారు స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకున్నారు.

గవర్నర్ చొరవను కూడా సీఎం దొరగారు అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంగా కెసిఆర్ గారు తన బాధ్యతల నిర్వహణలో విఫలమైనందు వల్ల గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు.

గవర్నర్ చొరవను సీఎం కేసీఆర్ గారు అనవసర రాద్ధాంతం చేయడం కంటే, ప్రజలకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవడం మేలు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదు,” అని విజయశాంతి ట్వీట్ చేశారు.


Related Post