నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో బాలానగర్ కూడా ఒకటి. బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్, జీడిమెట్ల, కూకట్పల్లిలో గల పారిశ్రామిక ప్రాంతాలకు బాలానగర్ మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. కనుక బాలానగర్ వద్ద నిత్యం బారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా అక్కడ రూ.68.67 కోట్లు వ్యయంతో జీహెచ్ఎంసీ 1.13 కిమీ పొడవుండే ఒక ఫ్లై-ఓవర్ నిర్మాణం చేపట్టింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం ఫ్లై-ఓవర్ నిర్మాణపనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కరోనా కారణంగా మొదట్లో నిర్మాణపనులు నిలిచిపోయినప్పటికీ, ఇప్పుడు వేగం పుంజుకొన్నాయి. ఈ ఏడాది నవంబర్కల్లా బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణపనులు పూర్తవుతాయి. ఇది అందుబాటులోకివస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుందని భావిస్తున్నాను. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాసులు శరవేగంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూస్తున్నారు,” అని అన్నారు.