జూన్ 8 నుంచి యాదాద్రిలో భక్తులకు ప్రవేశం

June 03, 2020


img

జూన్ 8నుంచి దేశంలో అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిలు వగైరా తెరుచుకోవచ్చునని కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో అదే రోజు నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రంలో కూడా భక్తులకు ప్రవేశం కల్పించబోతున్నట్లు ఆలయ ఈవో ఎన్‌. గీత తెలిపారు. అయితే కరోనా నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. 

కొండపైకి బస్సులు, కార్లు, ఆటోలు తదితర వాహనాలను అనుమతించరు. కనుక భక్తులందరూ తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూ కాలినడకన కొండపైకి చేరుకోవలసి ఉంటుంది. 10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులను కొండపైకి అనుమతించరు. సత్యనారాయణ స్వామివారి వ్రతానికి 50 మంది దంపతులు, శ్రీవారి కళ్యాణానికి 25 మంది దంపతులను మాత్రమే అనుమతిస్తారు. కరోనా లక్షణాలున్నవారిని కొండపైకి అనుమతించరు. కొండపైకి చేరుకొన్న తరువాత కూడా భక్తుల మద్య భౌతికదూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారమే భక్తులు ముందుకు సాగవలసి ఉంటుంది. దర్శనం చేసుకొన్న తరువాత కిందకు వెళ్లిపోవలసి ఉంటుంది. దర్శనాల అనంతర కొండపై తిరగడానికి అనుమతించరు.


Related Post