నేటి నుంచి జూన్ 8వరకు గ్రేటర్ పరిధిలో 150 వార్డులలో జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం (స్పెషల్ శానిటేషన్ డ్రైవ్) చేపడుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో నిత్యం కరోనా కేసులు నమోదవుతున్నాయి. త్వరలో వర్షాకాలం మొదలైతే సీజనల్ వ్యాధులు కూడా మొదలవుతాయి. కనుక ముందస్తు జాగ్రత్త చర్యగా150 వార్డులలో రోడ్లపక్కన, నాలాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, నీళ్ళు నిలుస్తున్న గుంతలను పూడ్చిపెట్టడం, గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలను తొలగించడం, ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను తొలగించడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టింది. ఒక్కో వార్డులో ఒక్కో రకమైన సమస్యలుండవచ్చు కనుక స్థానికులు, వార్డు మెంబర్ల సూచనల మేరకు పనులు చేపడతుంది. వార్డులవారీగా పారిశుధ్యకార్మికులను కేటాయించి వారికి అవసరమైన చెత్త తరలింపు వాహనాలు, యంత్రాలు, పరికరాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ అందజేసింది. డెప్యూటీ, జోనల్ కమీషనర్లు ఈ ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.