సిఎం కేసీఆర్ శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయరును ప్రారంభించబోతున్నారు. కరోనా నేపధ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది మంది ప్రజాప్రతినిధులను మాత్రమే ఆహ్వానించామని, కనుక స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి రావద్దని మంత్రి హరీష్రావు విజ్ఞప్తి చేశారు. రేపు రిజర్వాయరులోకి నీటిని విడుదల చేసిన తరువాత ప్రజలు వచ్చి చూడవచ్చని కానీ భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సిఎం కేసీఆర్ రేపటి కార్యక్రమాలు:
శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కొండపోచమ్మ దేవాలయ కమిటీ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్ రజిత-రమేశ్, ఆలయంలో చండీయాగం ప్రారంభిస్తారు.
ఉదయం 7 గంటలకు సిఎం కేసీఆర్ సతీసమేతంగా అక్కడకు చేరుకొని పూర్ణాహుతి చేసి, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకొంటారు.
ఉదయం 9.30 గంటలకు ఎర్రవల్లిలో తన సొంత ఖర్చుతో నిర్మించబోతున్న రైతు వేదికకు శంఖుస్థాపన చేస్తారు.
ఆ తరువాత అక్కడి నుంచి మర్కుక్ చేరుకొని అక్కడా రైతు వేదికకు శంఖుస్థాపన చేస్తారు. ఉదయం 10 గంటలకు మర్కుక్ పంప్హౌస్ చేరుకొంటారు. అక్కడ త్రిదండి చినజీయర్ స్వామి అధ్వర్యంలో సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు.
తరువాత ఉదయం 11.30 గంటలకు పంప్హౌస్లో మోటర్లను ఆన్ చేసి కొండపోచమ్మ సాగర్లోకి నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి నీరు విడుదలయ్యే ప్రాంతానికి వెళ్ళి గోదావరి జలాలకు ప్రత్యేక పూజ చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి వరదరాజు పూర్ చేరుకొని అక్కడి వరదరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు మళ్ళీ మర్కుక్ పంప్హౌస్ చేరుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సమావేశమవుతారు.
భోజన విరామం తరువాత కేసీఆర్ దంపతులు తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.