లాక్డౌన్ కారణంగా ఆదాయ వనరులన్నీ మూతపడటంతో చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు మార్చి, ఏప్రిల్ నెలల ప్రభుత్యోద్యోగులకు జీతాలలో కోతలు విధించాయి. ఏపీలో ప్రభుత్వోద్యోగులకు 50 శాతం కోత విధించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వోద్యోగ సంఘాల ప్రతినిధులు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకొని మే నెల నుంచి పూర్తి జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన సిఎం జగన్ ఆ మేరకు ఆర్ధికశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే మార్చి, ఏప్రిల్ నెల జీతాల బకాయిలు తరువాత చెల్లిస్తామని సిఎం జగన్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు నచ్చజెప్పారు. అయితే వీలైనంత త్వరగా వాటినీ చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కూడా ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు కోతలు విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పుడు క్రమంగా అన్ని రంగాలు పనిచేస్తున్నాయి కనుక రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు మే నెల పూర్తి జీతం ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.