సిఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో ప్రెస్మీట్ నిర్వహించి కరోనాను అరికట్టడానికి తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, ఇంకా అనేక ఇతర అనేక అంశాలపై సుదీర్గంగా మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి: "కరోనా దెబ్బకు అమెరికావంటి దేశమే అల్లాడిపోతోంది. భారత్కు అటువంటి పరిస్థితి వస్తే ఎవరూ ఏమీ చేయలేము. కరోనా వైరస్కు ఇంతవరకు మందులు, వ్యాక్సిన్లు కనుగొనలేదు. కనుక మనకున్న ఏకైక మార్గం మరికొన్ని రోజులు లాక్డౌన్ కొనసాగించడమే. ఇదే విషయం నేను ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు మీడియా ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. లాక్డౌన్ వలన దేశం, రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవచ్చు. దెబ్బతినవచ్చు. ఓ ఆరునెలలు అందరూ కష్టపడితే మళ్ళీ మన ఆర్ధికవ్యవస్థను చక్కదిద్దుకోవచ్చు కానీ మనుషుల ప్రాణాలు పోతే వెనక్కు తెచ్చుకోలేము. కనుక ఏప్రిల్ 14 తరువాత మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. లాక్డౌన్ కొనసాగించేందుకు కేంద్రప్రభుత్వం ఏమాత్రం సంకోచించనవసరం లేదు. ఓసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి తక్షణం నిర్ణయం తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను," అని అన్నారు.