కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్దులందరినీ పరీక్షలు వ్రాయకుండానే పైతరగతులకు పంపించాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏ సురేష్ గురువారం మీడియాకు ఈవిషయం తెలియజేశారు. ఈ సమయంలో విద్యార్దులకు పరీక్షలు నిర్వహించినట్లయితే వారు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉంటుంది కనుక ఈ సంవత్సరం 6 నుంచి 9 తరగతుల వరకు విద్యార్దులందరికీ పరీక్షలు వ్రాయడం నుంచి మినహాయింపునిచ్చే పాఠశాలలు తెరిచిన వెంటనే నేరుగా పైతరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని సిఎం జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము. అయితే 10వ తరగతి విద్యార్దులు మాత్రం పరీక్షలు నిర్వహించినప్పుడు హాజరుయ్యి వాటిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. లాక్డౌన్ తరువాత కరోనా ప్రభావంపై అంచనా వేసిన తరువాత 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకొంటాము. కనుక 10వ తరగతి పరీక్షలకు హాజరవ్వాల్సిన విద్యార్దులు ఆందోళన చెందనవసరం లేదు. పాఠశాలలు మూతపడినందున పేద విద్యార్దులకు వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం పంపిస్తాము,” అని చెప్పారు.
ఇప్పటికే కరోనా వ్యాపార,వాణిజ్య, పరిశ్రమ తదితర అన్ని రంగాలను అస్తవ్యస్తం చేస్తోంది. కరోనా దెబ్బకు విద్యావ్యవస్థ కూడా దెబ్బ తింటోంది. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, ఎంసెట్, నీట్ పరీక్షలు వాయిదా పడితే విద్యాసంవత్సరాలు (అకడమిక్ క్యాలండర్ ఈయర్స్)లో కూడా మార్పులు అనివార్యమవుతాయి.