నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డితో అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ్ళ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాలలో మొక్కలునాటారు.
మంత్రి కేటీఆర్ తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, “బహుముఖ ప్రజ్ఞాశాలి..ధైర్యశాలి..దయాగుణం కలిగినవారు.... ప్రజాభిమానం పొందినవారు....అత్యంత సమర్దుడైన వ్యక్తి..నాన్న అని నేను గర్వంగా పిలుచుకొనే కేసీఆర్గారు..మీరు ఆయురారోగ్యలతో చిరకాలం జీవించాలని...మీ నిబద్దత... దూరదృష్టితో మా అందరికీ నిరంతరం స్పూర్తి కలిగిస్తుండాలని కోరుకొంటున్నాను. తల్లిని కన్న తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
మంత్రి హరీష్రావు కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ మీ స్వప్నం..ఈ రాష్ట్రం మీ త్యాగఫలం. అభివృద్ధి మీ దక్షతకు నిదర్శనం..ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష...తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ..జన్మదిన శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో ఓ రకమైన అయోమయం, గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవి. కానీ సిఎం కేసీఆర్ నిబద్దత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాల కారణంగానే కేవలం రెండేళ్లలోనే రాష్ట్రంలో పెనుమార్పులు ప్రారంభమయ్యాయి. ఆరేళ్ళు గడిచేసరికి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ మారింది. రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న సిఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజల తరపున మైతెలంగాణ.కాం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.