గత నెల 29న ఎస్సార్ నగర్ జయప్రకాష్ నగర్లో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక శ్రీ విశ్వభారతి స్కూల్లో 8వ తరగతి చదువుతున్న మహేశ్ అనే విద్యార్ధిని క్లాసు టీచరు స్కేలుతో దెబ్బలు కొడుతున్నప్పుడు ఆమె నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో స్కూలు భవనంపై నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన మహేశ్ను స్కూలు యాజమాన్యం ఆసుపత్రిలో చేర్చి తల్లితండ్రులకు సమాచారం అందించింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్ శుక్రవారం తెల్లవారుజామున మరణించాడు. మహేశ్ తప్పకుండా కోలుకొని మళ్ళీ క్షేమంగా తిరిగివస్తాడని ఆశపడిన అతని తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, స్కూలులో స్నేహితులు అతను చనిపోయాడని తెలిసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇంతజరిగినా స్కూలు యాజమాన్యంపై పోలీసులు, డీఈఓ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు శ్రీ విశ్వభారతి స్కూలు ఎదుట ధర్నా చేసేందుకు రావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్సార్ నగర్లో భారీగా పోలీసులను మోహరించారు.