సిఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో అన్ని జిల్లాల కలక్టర్లలో సమావేశం కానున్నారు. సహకార సంఘాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు తప్ప అన్ని ఎన్నికలు పూర్తయిపోయినందున సిఎం కేసీఆర్ ఇక పూర్తిగా పరిపాలనపై దృష్టి సారించి నేడు కలక్టర్లతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో రెవెన్యూశాఖ భవిష్యత్ తేలనుంది. ఇప్పటికే రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్ పోస్టులను రద్దు చేసి వారిని అదే జిల్లాలకు అదనపు కలక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక ఈరోజు జరుగబోయే సమావేశంలో వారి అధికారాలు, బాధ్యతలు, డీఆర్వో పోస్టుల రద్దు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలలో 10వ తరగతి, ఇంటర్, యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ, వక్ఫ్ బోర్డు నిర్వహణ, పురపాలక సంఘాల కార్యక్రమాల నిర్వహణ తదితర బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేదానిపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. కనుక ఈరోజూ జరుగబోతున్న కలక్టర్ల సమావేశం చాలా కీలకమైనదని భావించవచ్చు.