నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31) వినయ్ శర్మ (26), పవన్ గుప్తా (25)లకు ఈ నెల 22 ఉదయం 7 గంటలకు ఒకేసారి చనిపోయేవరకు ఉరిశిక్ష అమలుచేయాలని డిల్లీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉరిశిక్షను వీలైనంతకాలం వాయిదా వేసేందుకు వారి లాయర్ విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. దోషులలో వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ల తరపున వారి న్యాయవాది సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయగా వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో చివరి ప్రయత్నంగా ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకొన్నారు. అయితే దానిని ఆయన తిరస్కరించారు. కనుక ఆ నలుగురికి రోజులు దగ్గర పడినట్లే. కానీ నిబందనల ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన తరువాత రెండువారాల వరకు ఉరిశిక్ష అమలుచేయరాదని వారి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. కనుక అంతవరకు ఉరిశిక్ష వాయిదా వేస్తారా లేదా కోర్టు ఆదేశాల మేరకు 22 ఉదయం 7 గంటలకు నలుగురిని ఒకేసారి ఉరి తీస్తారా? అనేది తెలియవలసి ఉంది.