ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విభజన సమస్యలపై వారిరువురూ చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల పంపకాలలో ఇరు రాష్ట్రాల మద్య తలెత్తిన వివాదంపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు కానీ ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదనపై తప్పకుండా వారిరువురూ చర్చించే అవకాశం ఉంది. దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తున్న భిన్న వాదనలు, అమరావతి రైతుల ఆందోళనలు వగైరాలన్నిటినీ సిఎం కేసీఆర్ కూడా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు కనుక జగన్ ఆయన సలహాలు, సూచనలు తీసుకొనే అవకాశం ఉంది. కానీ ఒకవేళ సిఎం కేసీఆర్ మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదని చెపితే జగన్మోహన్రెడ్డి ఆ ఆలోచనను విరమించుకోకపోవచ్చు కనుక దీని వలన ఎదురయ్యే సమస్యలను ఏవిధంగా ఎదుర్కోవాలో సిఎం కెసిఆర్ సూచిస్తారేమో.