సంచలనం సృష్టించిన ప్రియాంకా రెడ్డి హత్యకేసుపై బిజెపి నేత డికె.అరుణ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో దోషులను వెంటనే కటినంగా శిక్షించాలని కోరుతూ బిజెపి నేతలు శనివారం ధర్నాచౌక్ వద్ద మౌనదీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డికె.అరుణ మీడియాతో మాట్లాడుతూ, “హుజూర్నగర్ ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధి గెలవగానే ప్రెస్మీట్ పెట్టి గంటలు గంటలు మాట్లాడే సిఎం కేసీఆర్ రాష్ట్రంలో వరుసగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, సజీవదహనాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడరు? మీకు మీ మంత్రులకు బారీగా భద్రత ఏర్పాటు చేసుకొంటారు కానీ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించలేరా?ఆర్టీసీ సమ్మెను అణచివేయడానికి రాష్ట్రమంతటా వేలాదిమంది పోలీసులను మోహరించి ఆర్టీసీ కార్మికులను లాఠీ చేయించగలరు కానీ రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించలేరా? పోలీసులు, నిఘా వ్యవస్థలతో ప్రతిపక్షాలపై నిఘా పెడుతున్నప్పుడు సమాజంలో క్రిమినల్ మైండ్ సెట్స్ ఉన్నవారిపై నిఘాపెట్టి గుర్తించలేరా? బంగారు తెలంగాణ కంటే ముందు భద్రత తెలంగాణ కావాలి. సిఎం కేసీఆర్ ఇప్పటికైనా ఈ వరుస హత్యలు, అత్యాచారాలు, సజీవదహనాలపై స్పందించాలి. వీలైనంత వేగంగా నేరస్తులకు కటిన శిక్షలు పడేలా చేయాలి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలి,” అని డికె.అరుణ డిమాండ్ చేశారు.