కేంద్ర హోంశాఖ తెరాస వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దానిపై రమేష్ స్పందిస్తూ, “ఒక భారతీయ పౌరుడిగా నా పౌరసత్వహక్కును కాపాడుకొనేందుకు మళ్ళీ హైకోర్టుకు వెళతాను. కేంద్ర హోంశాఖ 2017లో నా పౌరసత్వం రద్దు చేసినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తరువాత 2019లో హైకోర్టు నా పౌరసత్వంపై చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. పౌరసత్వ చట్టప్రకారం కేవలం నిబందనలనే కాక వ్యక్తుల సామాజిక నిబద్దతను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. కానీ కేంద్రప్రభుత్వం దానిని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంది. ఒకవేళ నాకు అన్యాయం జరిగితే మళ్ళీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని ఆనాడే హైకోర్టు చెప్పింది. కనుక నా పౌరసత్వహక్కును కాపాడుకొనేందుకు మళ్ళీ హైకోర్టుకు వెళతాను. తుది వరకు పొరాడి నా హక్కును రక్షించుకొంటాను,” అని అన్నారు.