శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మూడు పార్టీల ప్రతినిధులు గవర్నర్ను కలిసి ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించవలసిందిగా కోరనున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఇంకా ఏర్పడక మునుపే మరో 25-30 ఏళ్ళ పాటు శివసేన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించబోతున్నారని ఆ పార్టీ చెప్పుకొంటుంటే, “మాకు 119 మంది ఎమ్మెల్యేలున్నారు. త్వరలోనే మేమే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము,” అని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చెపుతున్నారు. అంటే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, కర్ణాటకలో మాదిరిగా వారిలో కొంత మంది ఎమ్మెల్యేలను బయటకు రప్పించి వారి సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయనుందని భావించవచ్చు. అటువంటి ఆలోచన లేకుంటే బిజెపి ఈవిధంగా మాట్లాడి ఉండకూడదుకదా?